నల్లబెల్లి, ఏప్రిల్ 7: చేతికి అందివచ్చిన కొడుకు అకస్మాత్తుగా మృతి చెందడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండైల్పల్లె గ్రామానికి చెందిన రాదారపు రాజయ్య (60)కు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు నవీన్(32) ఎనిమిది నెలల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఎదిగిన కొడుకు మృతి చెందిన నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన రాజయ్య మనస్తాపానికి గురై శనివారం రాత్రి తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. గతంలో ఆయన మండల ఉత్తమ రైతుగా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నాడు. రాజయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.