హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల, ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ( Dasoju Shravan Kumar ) ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు.
మోకాలుకి, బోడి గుండుకి లింక్ పెట్టినట్లు, మొయినబాద్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్లో పార్టీ జరిగితే, దాన్ని కేటీఆర్కు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసీ, ఫ్యూచర్ సిటీ అవినీతి గురించి బైట పెట్టినందుకు కేటీఆర్పై దాడి చేస్తున్నారని విమర్శించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ గురించి మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతా అని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కేటీఆర్కు లింక్ పెట్టడం దేనికని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాగా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టొద్దని, టీడీపీ ఎంపీ అయినా సరే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినా సరే, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎవరు ఉన్నా తప్పు చేస్తే వదిలిపెట్టొద్దని సూచించారు.