హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ముంచుకొస్తున్న ఎన్నికల దృష్ట్యా విద్యార్థులను మచ్చిక చేసుకోవడమే లక్ష్యంగా కేంద్రం తాయిలాలు ప్రకటించింది. పరిశోధక విద్యార్థుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు వారికి అందించే ఫెలోషిప్ మొత్తాన్ని గణనీయంగా పెంచింది. జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్), సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) వంటి ఫెలోషిప్ మొత్తాన్ని పెంచుతున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అధికారికంగా ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటం, ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నదని వాదనలున్నాయి.
కేంద్రంలోని మోదీ సర్కార్ వైఖరి పట్ల విద్యార్థులు, ప్రత్యేకించి వర్సిటీల్లోని విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఫెలోషిప్లను పూర్తిగా విస్మరించింది. దీంతో పీహెచ్డీ అడ్మిషన్లు అటకెక్కాయి. యూజీసీ.. నెట్ పరీక్షలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించింది. దీంతో పరిశోధక విద్యార్థులంతా మోదీకి వ్యతిరేకమయ్యారు. ఈ అసంతృప్త జ్వాలాలను తగ్గించడంలో భాగంగా యూజీసీ నెల వారీగా అందజేసే ఫెలోషిప్ మొత్తాన్ని పెంచింది. అయితే పెంచిన ఫెలోషిప్ మొత్తం 2023 జనవరి 1 నుంచి అమలులో ఉంటుందని యూజీసీ ప్రకటించింది. అంటే ఎనిమిది నెలలు ఆలస్యంగా పెంపు ప్రకటన చేసింది. దీంతో ఈ ఎనిమిది నెలల్లో చేరిన వారికి పెంచిన మొత్తం అందుతుందా లేదా అన్నది అనుమానంగానే మిగిలి ఉన్నది.