మద్దూరు/వరంగల్ : ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆరునెలల వ్యవధిలో ఇద్దరు ఉద్యమనేతలను కోల్పోయింది. గుండెపోటుతో.. ఆరు నెలల వ్యవధిలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(Kusuma Jagadish), జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి(Pagala Sampath reddy) ఇరువురు జడ్పీ చైర్మెన్లు మృత్యువాత పడటం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఇద్దరు నేతలు కూడా సామాన్య కుటుంబాల నుంచి ఎదిగి వచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో అడుగులో అడుగు వేస్తూ అంచలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకొని అందరి మన్ననలు పొందారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లికి చెందిన జగదీశ్వర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట ఉన్నారు.
14 ఏండ్లపాటు హైదరాబాద్లోని బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యాలయంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అతడి సేవలను గుర్తించిన కేసీఆర్ జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించారు.అలాగే ఉద్యమంలో ముందుండి పోరాడిన మరోనేత సంపత్రెడ్డి. అతడి సేవలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జడ్పీ చైర్మన్గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జోడు పదవులను కట్టబెట్టారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత సోమవారం మధ్యాహ్నం స్టేషన్ ఘన్పూర్లో తొలిసారి నిర్వహించిన మీడియా సమావేశంలో సంపత్రెడ్డి పాల్గొని అందరితో కలివిడిగా గడిపారు.
కడియం గెలుపు సంబురాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఆయన స్వీట్లు పంచి ఉత్సాహంగా కనిపించిన కొద్దిసేపటికే కానరాని లోకాలకు వెళ్లడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. పాగాల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయ నకు భార్య సుజాతారెడ్డి, కూతురు సంజనారెడ్డి ఉన్నారు. కుమారుడు సాయిరెడ్డి 2010 జూన్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంపత్రెడ్డి మానసికంగా బాగా కుంగిపోయారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగే దశలో వీరు ఇరువురు ఉద్యమకారులు మృతి చెందడం తెలంగాణ సమాజానికి తీరని లోటు.