రామగిరి, మార్చి 9: పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల గని ప్రమాదంలో బొగ్గు పొరల్లో చిక్కుకొన్న మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం రాత్రి డిప్యూటీ మేనేజర్ మృతదేహం దొరకగా, బుధవారం సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. ఈ నెల 7న ఉదయం గనిలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు, ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకొన్న విషయం తెల్సిందే. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సింగరేణి రెస్క్యూ బృందం రెండు రోజులు శ్రమించి నలుగురిని ప్రాణాలతో కాపాడింది. మిగతా ముగ్గురి కోసం అన్వేషిస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహం దొరికింది. అర్ధరాత్రి ఒంటిగంటకు ఏరియా సేఫ్టీ అధికారి జయరాజు, తెల్లవారుజామున 5:30 గంటలకు కాంట్రాక్ట్ తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. తమవారు మృతిచెందారనే వార్త విని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతి చెందిన వారిలో ఏరియా సేఫ్టీ అధికారికి రావాల్సిన బెనిఫిట్స్ రూ.2.88 కోట్లతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్యకు రావాల్సిన రూ.1.08 కోట్లతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తామని యాజమాన్యం ప్రకటించింది. మరో కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. అయితే రూ.30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పంద సంస్థతోపాటు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది.
సింగరేణి సీఎండీ దిగ్భ్రాంతి..
గని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై సీఎండీ శ్రీధర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రక్షణపై ఖర్చుకు వెనుకాడకుండా గనుల్లో చర్యలు తీసుకుంటున్నామని, అయినా ఇలాంటి ఊహించని దుర్ఘటన జరిగి ముగ్గురిని కోల్పోవడం ఎంతో బాధించిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు సంస్థ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతి చెందిన వారికి చెల్లించాల్సిన మొత్తాలను వెంటనే వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని, కుటుంబంలో అర్హులైన వారికి వెంటనే కోరిన చోట ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.