ఖలీల్వాడి, నవంబర్ 5 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి అక్కడి జైలులో చిక్కుకున్న బాధితులను క్షేమంగా ఇంటికి రప్పించారు. నిజామాబాద్లోని నాగారం ప్రాంతానికి చెందిన అసియా బేగం, షేక్ నసీమా పది నెలల క్రితం బతుకుదెరువు కోసం ఖతార్ వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరారు. పనిలో చేర్చుకున్న వారు జీతం సరిగ్గా ఇవ్వకపోగా వేధింపులకు గురిచేశారు. కొట్టడం, తిట్టడం, భోజనం పెట్టకపోవడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు చిక్కడంతో జైలుకు పంపారు. ఈ విషయాన్ని వారి బంధువులు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారికి తెలిపారు.
విషయం తెలుసుకున్న కవిత ఖతార్లోని జాగృతి అధ్యక్షురాలు నందిని అబ్బగోనికి సమాచారం అందించగా.. ఆమె జైలుకు వెళ్లి వారితో మాట్లాడారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి, కేవలం 10 రోజుల్లో బాధితులను జైలు నుంచి బయటికి తేవడంతోపాటు ఖతార్ అధికారులకు సమస్యను విన్నవించి ఉచిత విమాన టికెట్లను ఏర్పాటు చేయించారు. క్షేమంగా ఇంటికి చేరిన బాధిత మహిళలను శనివారం జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్, యూత్ జిల్లా అధ్యక్షుడు రెహాన్ పరామర్శించారు. తమను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ కవితకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.