హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటు వేసే రోజున ప్రిసైడింగ్ ఆఫీసర్(పీవో) కీలక పాత్ర పోషించనున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఏజెంట్లకు అనుమానాలు, సందేహాలకు పీవోనే సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. పీవోలుగా దాదాపు గెజిటెడ్ అధికారులనే నియమించారు. వారికి ఈవీఎంల ఏర్పాటు, సీల్ చేయటం, మాక్ పోలింగ్, ఇతరత్రా వాటిపై సమగ్రంగా వివరించారు. టెండర్ ఓటు, చాలెంజ్ ఓటుపై మరింత అవగాహన కల్పించారు. ఒక అభ్యర్థి ఒక పోలింగ్ స్టేషన్కు ఒక ఏజెంట్, ఇద్దరు రిలీవర్ ఏజెంట్లను నియమించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.