వరంగల్ చౌరస్తా/యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 20 : పోలీస్ కొలువుల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలో పాల్గొని గుండెపోటుకు గురైన ఇద్ద రు అభ్యర్థులు ప్రాణాలు విడిచారు. వివరాలు ఇలా.. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా పందికుంట జీపీ పరిధిలోని శివతండాకు చెందిన బానోత్ రాజేందర్(27) ఈనెల 17న 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గుండెపోటుకు గురయ్యా డు. వెంటనే అతడిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే మళ్లీ గుండెపోటు రావడంతో వైద్యులు ఆర్ఐసీయూకు తరలించారు. రెండు రోజులుగా వైద్యానికి స్పందించక పోవడంతోపాటు సోమవారం అర్ధరాత్రి మరో మారు తీవ్ర గుండెపోటుకు గురికావడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన ముడుగుల సతీశ్ (28) కొన్ని రోజులుగా కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. సోమవారం నల్లగొండలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్కు వెళ్లాడు. ఇందులో భాగంగా 1600 మీటర్ల రన్నింగ్ చేస్తూ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన పలువురు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక డ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సతీశ్కు ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది.