మహబూబాబాద్ : విహార యాత్ర వారి పాలిట విషాదాన్ని మిగిల్చింది. వేగంగా వెళ్తున్న కారు( Car Accident) అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Died) చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్(Mahabubabad) పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నుంచి కారులో మారేడుమిల్లికి విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వెంగళదాసు సాయిరాం, రవితేజగా గుర్తించారు. సంగినేని సాయిరాం, లక్ష్మణ్, సాయితేజకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.