హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. ఈ నెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో ఆల్పపీడనం ఏర్పడవచ్చని, ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై 9 నాటికి తుఫానుగా బలపడవచ్చని పేర్కొన్నారు. బుధవారం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తన సగటు సముద్ర మట్టానికి సుమారు కిలోమీటరు ఎత్తులో స్థిరంగా కొనసాగుతున్నదని, ఇది తుఫానుగా ఏర్పడితే దానికి ‘మోచా’ అని పేరు పెట్టనున్నట్టు పేర్కొన్నారు.