హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. రెండు వారాలుగా రాయలసీమలో తిష్టవేసిన రుతుపవనాల్లో స్వల్ప కదలిక మొదలైంది. ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నదని వివరించింది. తెలుగు రాష్ర్టాల్లో రుతుపవనాలు విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో తగ్గని ఎండలు
రుతుపవనాలు ఆలస్యమవుతుండటంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటదని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఎండ తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండు రోజులపాటు తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా తలకు టవల్ లాంటి వస్త్రం చుట్టుకోవాలని, దాహం అనిపించకపోయినా నీళ్లు తాగాలని సూచించింది. మరోవైపు హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.