హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సీఎల్పీ వేదికగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి (సీఎల్పీ) ములుగు ఎమ్మెల్యే సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి డుమ్మా కొట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వర్గంలో కీలక నేత అయిన సీతక్క సీఎల్పీ భేటీకి రాకపోవటంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. రేవంత్రెడ్డి వర్గం కావాలనే సమావేశాన్ని బహిష్కరించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. పేరుకు సీఎల్పీ సమావేశమైనా నేతల గైర్హాజరు, అంతర్గత తగాదాలతో ఎలాంటి హడావిడి లేకుండానే సాదాసీదా జరిగింది. రాష్ట్రంలోని సమస్యలపై సమావేశంలో చర్చించినట్టు పైకి చెప్తున్నప్పటికీ, జరిగిందంతా ఒట్టి బాతాఖానేనని సమాచారం.