భద్రాద్రి కొత్తగూడెం : నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ చర్ల లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్కు చెందిన ఇద్దరు సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎదుట శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు గట్టుపల్లి సురేశ్, బొడిక బీమయ్య అలియాస్ బీమన్నగా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఆవుపల్లి తహసీల్, పాతూరు అదేవిధంగా సుక్మా జిల్లా కుంట తహసీల్ పువ్వర్తికి చెందినవారన్నారు. గత ఆరు సంవత్సరాలుగా వీరు మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దశలో మిలిషియా సభ్యులుగా కొనసాగి గత మూడేళ్లుగా చర్ల ఎల్వోఎస్ సభ్యులుగా పనిచేస్తున్నారన్నారు.
మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ వేధింపులు భరించలేక, సమాజంలో మెరుగైన జీవితం గడిపేందుకు లొంగిపోయినట్లుగా తెలిపారు. మావోయిస్టు పార్టీ ఉమెన్ కేడర్ను, గిరిజన పిల్లలను బలవంతంగా పార్టీలో కొనసాగేలా చూస్తున్నారన్నట్లు ఎస్పీ తెలిపారు. చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ మావోయిస్టు నాయకత్వం వారిని బెదిరిస్తూ బలవంతంగా గ్రామాల నుండి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. పోలీసుల ఎదుట లొంగిపోనిస్తలేరన్నారు. ఈ నేపథ్యంలో దళ సభ్యులందరికీ ఎస్పీ ఓ విన్నపం చేశారు. మెరుగైన జీవతం కోసం సంబంధీకులను, పోలీసులను ఆశ్రయించి లొంగిపోవాల్సిందిగా కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఎస్పీ నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ డా.వీనేశ్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ హరి ఓం ఖేరీ, సెకండ్ ఇన్ కమాండ్ ప్రమోద్ పవార్, చర్ల సీఐ వి. అశోక్, తదితరులు పాల్గొన్నారు.