హైదరాబాద్ : ఒడిషా(Odisha) రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు(Maoists) మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు కోటగడ్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.
దీంతో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు, బారి అలియాస్ రాకేష్, మరొకరు అమృత్గా గుర్తించారు. సంఘటన స్థలంలో రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బారి తలపై రూ.22 లక్షల నగదు బహుమతి ప్రకటించగా, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ప్రకటించారని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, మరిన్ని బలగాలను మోహరించామని ఏడీజీ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) సంజీబ్ పాండా తెలిపారు.