హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర నేతలు చేస్తున్న కుట్రలను కేంద్రం మరోమారు బట్టబయలు చేసింది. పేదలకు ఇండ్లు కట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, నిధులను దారిమళ్లించిందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బూటకమని తేల్చింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ దార్మనికతను గురువారం పార్లమెంటు వేదికగా ప్రశంసించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (పీఎంఏవై-యూ) కింద రాష్ర్టానికి 2,33,108 ఇండ్లను మంజూరుచేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,98,983 గృహాల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించిందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిశోర్ లోక్సభలో చెప్పారు. 2015లో ప్రారంభించిన పీఎంఏవై-యూ కింద రాష్ర్టానికి రూ.4,057.14 కోట్లు కేటాయించామని, కానీ రూ.2,827.41 కోట్లు మాత్రమే విడుదల చేశామని వెల్లడించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు బదులుగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
వాటాను మించి అదనపు వ్యయం చేసిన రాష్ట్రం
పీఎంఏవై-యూ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఒక్కో ఇంటి నిర్మాణానికి (రూ.3 లక్షల చొప్పున) 60 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ కేటాయించిన దానికంటే సగం మాత్రమే విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం తన వాటా 40శాతానికి మించి అదనపు నిధులు ఒక్కో ఇంటికి (రూ.7లక్షలు) ఖర్చు చేసి పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చింది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఇండ్లు మంజూరు చేయడంలో, నిధుల మంజూరులోనూ కేంద్రం తెలంగాణపై వివక్షను బయటపెట్టుకుంది. తెలంగాణలో 2.33 లక్షల ఇండ్లు కేటాయించి ఏపీకి 20.4 లక్షలు, మహారాష్ట్రకు 13.52 లక్షలు, యూపీకి17.67 లక్షల ఇండ్లు కేటాయించింది. ఇందులో 1.98 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి తెలంగాణ మిగిలిన రాష్ర్టాలకంటే మెరుగైన స్థితిలో నిలిచింది. ఇదే సమయంలో ఏపీ 4.62 లక్షలు, మహారాష్ట్ర 4.78 లక్షలు, యూపీ 9.48 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.