Road Accident | జహీరాబాద్, మే 5 : మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామ శివారులోని 65వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ కథనం ప్రకారం… స్థానిక పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామ శివారులోని హైదరాబాద్ ముంబై 65వ జాతీయ రహదారిపై ఓవర్ లోడ్తో ఉన్న ట్రక్కు వెనక్కి వస్తూ.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వస్తున్న కారు సైతం టాటా ఏస్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కాసుల మహేశ్ గౌడ్ (26), రోహిత్(16) అక్కడికక్కడే మరణించారు. నర్సింహులు (32), కార్తీక్(27) సాయి(9) తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే జహీరాబాద్ పట్టణ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కాగా, వీరంతా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.