హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం -2024 కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా, అందులో తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం గర్వకారణమని మంత్రి అన్నారు.
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మదకు చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో 8 కోట్ల టర్నోవర్ చేసినందుకు.. సహజ సిద్ద రంగులను ఉపయోగించి జీఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్తో పట్టుచీరను నేసిన గూడ పవన్కు జాతీయ చేనేత అవార్డుకు ఎంపికై చేనేత రంగంలో ఆదర్శంగా నిలిచారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందులోభాగంగానే ఇటీవల చేనేత కార్మికుల కోసం రుణమాఫీ ప్రకటించి, 33 కోట్లు మంజూరు చేశామన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం కోసం ప్రత్యేక లేబుల్ను ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.