మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకొన్న ఇద్దరు రైతులను మంత్రి కేటీఆర్ సహకారంతో హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెందిన సోదారి సారయ్య, గట్టయ్య బుధవారం మేతకు వెళ్లిన ఎడ్లను తోలుకువచ్చేందుకు వెళ్లారు. గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో సాయంత్రం అక్కడే చిక్కుకొన్నారు. ప్రాణాలు రక్షించుకొనేందుకు సమీపంలోని లిఫ్ట్ పథకం (వాటర్) ట్యాంకు పైకి ఎక్కారు. విషయం తెలుసుకొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. కలెక్టర్ భారతీ హోళీకేరి అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం బాల్క సుమన్ మంత్రి కేటీఆర్కు ఫోన్లో పరిస్థితిని వివరించారు. తక్షణ సహాయం కోసం హెలికాప్టర్ పంపించాలని కోరారు. మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే హెలికాప్టర్ను పంపించగా సారయ్య, గట్టయ్యలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామ పెద్ద చెరువు అలుగు వద్ద బుధవారం రాత్రి వడ్యాల్కు చెందిన దాసరి గంగామణి అనే యువతి ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయింది.
నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ శివారులో కాలూర్ రోడ్డుపై మైసమ్మ గుడి పక్కన ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నీటిలో ఖానాపూర్ గ్రామ వాసి చిన్నబ్బు బాపన్న (62) గల్లంతయ్యాడు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో గురువారం ఇంటి గోడకూలి మైదం రాజమణి (40) మృతి చెందింది.