జనగామ, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)/నర్మెట/ధారూరు : పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక జనగామ, వికారాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురానికి చెందిన రైతు ఉచ్చెంతల శ్రీను (47) నాలుగు ఎకరాల్లో వేసిన వరి పంటను కాపాడుకునేందుకు నాలుగు బోర్లు వేసి నీళ్లు పడక.. కండ్ల ముందే పచ్చటి పొలం ఎండిపోయింది. సాగుపై పెట్టిన పెట్టుబడికి అదనంగా బోర్ల కోసం చేసిన ఖర్చు.. పైగా గత ఏడాది కొత్తగా కట్టుకున్న ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు తోడైంది. పంట ఎండి.. తెచ్చిన అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను శుక్రవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. సమీప రైతులు చూసి వెంటనే జనగామ జిల్లా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. 10 ఎకరాల భూమి ఉన్న ఆసామిగా శ్రీను 30 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. నిరుడు ఇంటి నిర్మాణం కోసం, బోర్లు వేసేందుకు, సాగు పెట్టుబడికి రూ.పది లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కొడుకులు రాకేశ్, అరవింద్, కార్తీక్ ఉన్నారు. పెద్ద కొడుకు రాకేశ్కు ఇటీవలే పెండ్లి కుదిరింది. ఆగస్టులో ముహూర్తం పెట్టుకుందాం అనుకునేలోపు ఇంటి పెద్ద ఆత్మహత్యతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. తరిగొప్పుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగారంలో పురుగుమందు తాగి..
వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన ముసలిగల అనంతయ్య (42)కు 30 గుంటల పట్టా పొలం, ఆయన భార్య పేరిట లావాణి పట్టా 2 ఎకరాలు ఉన్నది. 30 గుంటల పొలంలో వరి, 2 ఎకరాల్లో కంది, మక్క సాగు చేశాడు. వర్షాలు లేక కంది, మక్క పంటలు ఎండిపోయి నష్టం జరిగింది. రూ.3 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఎవుసం సాగక, అప్పు తీర్చే దారి లేక తరుచూ బాధపడేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 22న మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆయనే వెళ్లి తాండూరు దవాఖానలో చేరాడు. ఈ నెల 25న మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో స్పృహ కోల్పోయాడు. దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.