హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గడిచిన రెండేండ్లు పర్యాటక రంగానికి ఏమాత్రం కలిసిరాలేదు. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం, అంతర్రాష్ర్టాల మధ్య రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో స్వదేశీ, విదేశీ పర్యాటకుల రాక పడిపోయింది. 2018లో 9.28 కోట్ల మంది రాష్ట్రంలో పర్యటిస్తే, 2021లో 3.2 కోట్ల మందే వచ్చినట్టు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ వెల్లడించింది.
జీహెచ్ఎంసీ, యాదాద్రి జిల్లాలకే ఎక్కువ
గడిచిన నాలుగేండ్లలో జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకే పర్యాటకుల తాకిడి కొనసాగింది. మ్యూజియం, పార్కులు, ట్యాంక్బండ్ తదితర ఆహ్లాదకర ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా వచ్చారు. ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన యాదాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రం ఉన్న సిరిసిల్ల జిల్లాలు పర్యాటకులను ఆకర్షించిన రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.