ములుగు : ములుగు జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి యువతీ యువకుడు గల్లంతయ్యారు. ఇందులో యువకుడు మృతి చెందగా.. యువతి ఆచూకీ దొరకలేదు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ఇక్ ఫై బిజినెస్ స్కూల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థుల బృందం లక్నవరం చెరువును చూసేందుకు వచ్చారు.
ఈ క్రమంలో రెండో ఐలాండ్కు చేరుకొని సరదాగా సరస్సులోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ యువకుడు ఇద్దరు తోటి విద్యార్థుల కళ్లముందే నీట మునిగి పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. ఇందులో యువకుడి మృతదేహం లభ్యమవగా.. యువతి ఆచూకీ తెలియలేదు. మృతుడు సాయి ప్రీతమ్ (24), గల్లంతైన యువతి తరుణి (20)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.