మెదక్: మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగి (Narsingi) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కాస్లాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్ (Container) లారీలు ఢీకొన్నాయి. దీంతో ఓ లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపుచేశారు. మృతులను కర్ణాటకకు చెందిన నాగరాజు, బసవరాజుగా గుర్తించారు.
రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ను మరో కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.