పెద్దపల్లి రూరల్/హత్నూర, ఫిబ్రవరి 10: ఇటుక బట్టీల వద్ద జరిగిన ఫుడ్ పాయిజన్తో వేర్వేరు చోట్ల నలుగురు మృతి చెందారు. మరో 19 మంది అస్వస్థత కు గురయ్యారు. ఈ ఘటనలు పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని గౌరెడ్డిపేట, రంగాపూర్ శివారులో ఎంఎస్ఆర్ ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా కార్మికులు రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం అన్నం తిని పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో కొంత మంది తల తిరిగి పడిపోయారు. గమనించిన సూపర్వైజర్లు వెంటనే యజమానికి సమాచారం ఇచ్చారు. వారందరినీ పెద్దపల్లి దవాఖానకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితిని బట్టి ఆరుగురిని కరీంనగర్కు తరలించారు. పెద్దపల్లిలో నలుగురు చికిత్స పొందుతున్నారు.
మరికొందరిని వరంగల్కు పంపించారు. కాగా.. కరీంనగర్కు తరలించిన వారిలో ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ భారీషా (54) శుక్రవారం సాయంత్రమే మృతి చెందగా ఆయన మృతదేహాన్ని అధికారులు రాకముందే దహనం చేశారు. ఇదే తరహాలో పరిస్థితి విషమించి లలితమాజీ (26) అనే మహిళా కార్మికురాలు శనివారం మృతి చెందింది. ఈ ఘటనపై పెద్దపల్లి సీఐ కృష్ణ, బసంత్నగర్ ఎస్సై వెంకటేశ్ పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి, విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, ఇటుక బట్టీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సులువ వెంకటేశ్ తెలిపారు.
ఒడిశాకు చెందిన అమలాల్ మొహజీ (35) భార్య నర్మద మొహజీ, ఇద్దరు కొడుకులు జైమొహజీ, అన్షు మొహజీతో కలిసి బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం శివారుకు వచ్చి ఇటుక బట్టీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అమలాల్ మొహజీ, చిన్నకొడుకు రెండున్నరేండ్ల అన్షు మొహజీ విరేచనాలతో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి విరేచనాలు ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఇటుక బట్టీల యజమాని మాన్సింగ్ తన కారులో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించాడు. అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఇంటిపెద్దతోపాటు కుమారుడు మృతిచెందడంతో మృతుడి భార్య నర్మద మొహజీ కన్నీరుమున్నీరైంది. నర్మద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హత్నూర ఎస్సై సుభాష్ తెలిపారు. కాగా.. ఇటుక బట్టీల వద్ద యజమానులు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి కుటుంబ సభ్యులతో వలస వస్తున్న కార్మికులకు బట్టీల వద్ద యజమానులు కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.