TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ ఒడిశా తీరంలో వాయుగండం గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోందని.. ఒడిశా గోపాల్కు పశ్చిమాన 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉందని తెలిపింది. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గడఢ్ మీదుగా దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ ఒడిశా మీదుగా ఉన్న వాయుగుండం నుంచి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్నాటక మీదుగా గోవా వరకు ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. సెప్టెంబర్ 30న ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో అక్టోబర్ ఒకటి నాటికి ఉత్తర, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.