Mahabubabad | మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వారు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. బయ్యారం మండలం నామాలపాడులో అనిల్, దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు లోహిత(3), జశ్విత(1) ఉన్నారు. వారం రోజుల క్రితం అనిల్ తన భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామం అంకన్నగూడెంకు వచ్చాడు. అనిల్ తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున షాపునకు వెళ్లిన వెంకన్న.. తిరిగి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. కుమారుడు, కోడలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. అంకన్నగూడెం చేరుకున్న పోలీసులు.. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.