దుండిగల్/ఎల్బీనగర్, డిసెంబర్ 15: హైదరాబాద్లో శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన కుక్కల దాడుల్లో ఇద్దరు బాలలకు తీవ్రగాయాలయ్యాయి. నిజాంపేట బండారి లే అవుట్ కాలనీ పార్కుకు తల్లితో కలిసి వెళ్లి ఆడుకుంటున్న రెండున్నరేండ్ల బాలిక సోమశ్రీపై హఠాత్తుగా అక్కడికి వచ్చిన ఓ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి మెడపై తీవ్రగాయాలయ్యాయి. బాధిత బాలిక ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నది. గడ్డి అన్నారం డివిజన్ శాంతినగర్లో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటుండగా కుక్కల గుంపు వారిపై దాడి చేసింది. బాలలు ఓ ఇంటిలోకి వెళ్లగా వారి వెంటే పరిగెత్తి మరీ బిట్టు అనే ఐదేండ్ల బాలుడి కాలు కొరికి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలతో నగరంలో వీధికుక్కల బెడదపై ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది.