మక్తల్ టౌన్, డిసెంబర్ 24: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది. సీఐ రాంలాల్, ఎస్సై పర్వతాలు కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం కార్వార్ నుంచి కారులో ఇండియన్ నేవీ ఉద్యోగి దీపక్ సమాల్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని నీలహళ్లి గ్రామానికి చెందిన ఖలీల్, మౌలాలి, రహిమాన్యా బేగం మరో కారులో హైదరాబాద్ వైపు నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో మక్తల్ మండలం జక్లేర్ గ్రామ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దీపక్ సమాల్ భార్య ప్రబిత (32), కూతురు అస్మిత (7), నీలహళ్లి గ్రామానికి చెందిన ఖలీల్, మౌలాలి, రహిమాన్యా బేగం ప్రమాద స్థలంలోనే చనిపోయారు. దీపక్ సమాల్, మడి మాలప్పలకు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం స్థానికులు మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మాలప్పను మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు, దీపక్సమాల్ను హైదరాబాద్కు తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ దవాఖానలో భద్రపరిచారు. మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.