హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మల్టీజెట్ ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆ సంస్థ ఎండీ టేకుల ముక్తిరాజ్, భాస్కర్ను సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రకు చెందిన మోతీలాల్ సర్కార్, ప్రశాంత్ ఏక్నాథ్ బురండే ఈ ఏడాది జూలైలో హబ్సిగూడలో ‘రియల్ లైఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్’ పేరిట ఓ సంస్థను ప్రారంభించారు.
దీన్ని ఆగస్టులో టేకుల ముక్తిరాజ్, భాస్కర్ టేకోవర్ చేసి సంస్థ పేరును ‘మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్గా మార్చారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే రోజువారీగా 2 నుంచి 3% రాబడి ఇస్తామని నమ్మబలికారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించి అందులో 11రకాల వస్తువులపై పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. దీంతో పలువురు మల్టీజెట్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అనంతరం ‘మల్టీజెట్’ నిర్వాహకులు ఆ సంస్థను మూసేసి బిచాణా ఎత్తేయడంతో పెట్టుబడిదారులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు ముక్తిరాజ్, భాస్కర్ను అరెస్టు చేశారు.