కుమ్రంభీం ఆసీఫాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్ రూరల్, జూలై 14 : సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజామొద్దీన్ వెళ్తున్న దురంతో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12285) రైలులో గురువారం కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు ఆర్మీ జవాన్లు బల్జిత్ సింగ్, విశాల్ ఢిల్లీ వెళ్లేందుకు సికింద్రాబాద్లో దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలులోని బీ-4 ఏసీ కంపార్ట్మెంట్లో వీరు ప్రయాణిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మంచిర్యాల – బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో బల్జిత్ సింగ్ వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్ను విశాల్ తీసుకొన్నాడు. ఆ రివాల్వర్ను విశాల్ కిందకు పేల్చడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో ఆ కంపార్ట్మెంట్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పలువురు ప్రయాణికులు టీసీ రాజశేఖర్కు సమాచారమిచ్చారు. కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో వీరిద్దరిని దింపి రైల్వే పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి రివాల్వర్తోపాటు మద్యం సీసాను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వీరిని వరంగల్ రైల్వే కోర్టులో అప్పగించనున్నట్టు ఎస్సై సుధాకర్ తెలిపారు.