హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అక్రమంగా వన్యప్రాణి అవయవాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని హైదరాబాద్ జోన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఓ హోటల్లో పులి అవయవాలను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పులి దందాలు, 7 పులిగోర్లను స్వాధీనం చేసుకున్నారు.
పులి అవశేషాలను కేరళకు చెందిన జుకరియా అనే వ్యక్తి నుంచి సేకరించినట్టు నిందితులు అంగీకరించారు. దీంతో స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి అవశేషాలు, నిందితులను హైదరాబాద్ సెంట్రల్ ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి నిందితులను విచారించి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చగా, కోర్టు 15 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.