హైదరాబాద్ : ప్రభుత్వం జారీచేసిన అక్రిడిటేషన్ల జీవోపై జర్నలిస్టుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటుకు పూనుకుంది. డెస్క్ జర్నలిస్టులకు ( Desk Journalists ) సైతం అక్రిడిటేషన్ కార్డులే ( Accreditations Cards ) జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో నెంబర్ 103 పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ( TUWJ ) హర్షం వ్యక్తం చేసింది.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ( President Allam Narayana ) , ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ గతంలో తీసుకువచ్చిన 252 జీవో పై టీయూడబ్ల్యూజే చేసిన పోరాట ఫలితంగా జర్నలిస్టు సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవరణ జీవో తేవడం, అందులో ప్రధానంగా అందరి జర్నలిస్టుల మాదిరిగానే డెస్క్ జర్నలిస్ట్ సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీచేస్తామని చేస్తున్నారని స్పష్టం చేయడం ముదావహం అన్నారు.
మండల స్థాయిలో లక్షన్నరకు పైగా జనాభా ఉన్నచోట అదనపు కార్డులు ఇస్తామని పేర్కొనడంతోపాటు కల్చరల్, స్పోర్ట్స్, సినిమా జర్నలిస్టులకు సైతం ప్రత్యేకంగా కార్డులు జారీ చేస్తానని ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవో మారడం టీయూడబ్ల్యూజే సాధించిన విజయమని పేర్కొన్నారు.
అయితే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 239 జీవో ప్రకారం వచ్చినన్ని అక్రిడేషన్ కార్డులు ఈ సవరణ జీవో అనంతరం కూడా ఆ స్థాయిలో రావడంలేదని విషయం తేటతెల్లమైందన్నారు. కార్డుల సంఖ్య భారీగా తగ్గనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి 239 జీవో ప్రకారం జారీ అయిన కార్డుల సంఖ్యనే వర్తింపచేయాలని కోరారు.
కేబుల్ చానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు మరోసారి మొండిచెయ్యి
గతంలో రాష్ట్రస్థాయిలో కేబుల్ ఛానళ్లకు 12 కార్డులు చొప్పున ఐ అండ్ పీఆర్ ద్వారా జారీ చేశారని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈ సవరణ జీవోలో కేబుల్ ఛానల్స్ అంశమే లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.
యూనియన్గా మా అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కేబుల్ ఛానల్స్ విషయంలో, నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఇచ్చే కార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించక పోవడం అన్యాయమన్నారు. ఈ విషయమై సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ను వెంటనే కలిసి మరోమారు చర్చిస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఈ రెండు అంశాలపై భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామన్నారు.