మెట్పల్ల్లి, ఏప్రిల్ 15 : పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి. పసుపు కాడి (కొమ్ము) రకానికి క్వింటాల్కు గరిష్ఠంగా రూ.15 వేలు, కనిష్ఠంగా రూ.9,111, గోళ (మండ) రకానికి గరిష్ఠంగా రూ.13,388, కనిష్ఠంగా రూ.9,002, చూర రకానికి గరిష్ఠంగా రూ.10,511, కనిష్ఠంగా రూ.7,796 ధర పలికింది. కాగా కాడి, గోళ రకాలకు ఈ సీజన్లో ఇప్పటివరకు పలికిన ధరల్లో ఇదే అధికం కావడం విశేషం. అయితే, ఇవే ధరలు కొనసాగుతాయా? మళ్లీ తగ్గుముఖం పడుతాయా? అనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే రైతుల దగ్గరి నుంచి 80 శాతానికి పైగా పసుపు అమ్మకం జరిగి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రైతుల నుంచి భారీగా పసుపు రాగా కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని పలుమార్లు రైతులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. మెజార్టీ శాతం పసుపు అమ్మకం పూర్తయ్యాక ధర పెరగడం వల్ల ఒరిగే ప్రయోజనం లేదని రైతులు పేర్కొంటున్నారు.