కూకట్పల్లి: హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని సరికొత్త అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పో-2023కి వేదిక అయ్యింది. కూకట్పల్లిలో మెట్రో మాల్ ఎదరుగా ఉన్న ట్రక్ పార్కింగ్ మైదానంలో ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పోను ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమ్యూజ్మెంట్స్తోపాటు 500 రకాల సముద్ర చేపలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ అక్వేరియంలో అరభైమా రకం చేప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చేప బరువు 60 కిలోలు ఉంటుంది. దాని విలువ రూ.6 లక్షలు. ఆ చేప రోజుకు కిలోన్నర చికెన్ తింటుందట. ఈ నెల 14న మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఆ రోజు నుంచి 60 రోజుల వరకు అందుబాటులో ఉండనుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ చేపల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.