ముంబై: విదేశీ కంపెనీలు కేంద్రంతోనే వ్యవహరిస్తాయని, రాష్ట్రాలకు లేదా ప్రైవేటు కంపెనీలకు టీకాలు నేరుగా సరఫరా చేయవని ప్రచారం జరుగుతున్న సమయంలో రష్యాకు చెందిన స్పుత్నిక్-5 టీకా తయారీదారు నుంచి బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)కు బిడ్స్ అందాయి. ఈ నెల 11న బీఎంసీ కోటి డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. కోవిడ్ టీకాలను నేరుగా విదేశీ ఉత్పత్తిదారుల నుంచి దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తూ భారత ప్రభుత్వం ప్రకటించిన విధానానికి అనుగుణంగా ఈ టెండర్లు జారీ అయ్యాయి. బిడ్లు సమర్పించేందుకు గడువు మంగళవారంతో ముగుస్తుంది. స్పుత్నిక్ మూడు టెంర్లలో ఒకటి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి, రెండు దాని స్వతంత్ర ప్రతినిధుల నుంచి వచ్చాయి. న్యాయ, సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలను పరిశీలించి, మహారాష్ట్ర సర్కారును సంప్రదించి రెండువారాల్లో నిర్ణయం తీసుకుంటామని అధికార వర్గాలు తెలిపాయి. 60 రోజుల్లో కోటి డోసులు సరఫరా చేయగలమని స్పుత్నిక్ బిడ్డర్లు తెలిపారు. స్పుత్నిక్-5 ను మాస్కోలోని గామాలేయా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. 2020 ఆగస్టు 11న ఈ టీకాకు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. భారత్ లో ఈటీకా వినియోగానికి కూడా అనుమతి లభించింది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం ఇంకా లభించలేదు. పంజాబ్, ఢిల్లీ రాష్ట్ర ప్రబుత్వాలకు మోడర్నా, ఫైజర్ కంపెనీలు టీకాలు సరఫరా చేయలేమని, కేంద్రంతో మాత్రమే వ్యవహరించగలమని తెలిపిన నేపథ్యంలో బీఎంసీకి స్పుత్నిక్ బిడ్లు రావడం విశేషం.