హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. త్వరలోనే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టంచేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో పంటల కొనుగోళ్లపై మార్క్ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంటల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పంటల ఉత్పత్తులు భారీగా పెరిగిన ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలువాల్సిన కేంద్రం, తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని, కేవలం పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోయాబీన్, కంది, పొద్దుతిరుగుడు, శనగ, వేరుశనగ, పెసర పంటలను కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఉత్పత్తిలో 25 శాతం మాత్రమే అనే పరిమితులు పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో అకడకడ గన్నీ బ్యాగులు, డీజిల్ కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నది నిజమేనని ఒప్పుకొన్నారు. త్వరలోనే గన్నీ బ్యాగుల కొరతను పరిష్కరిస్తామని తెలిపారు.
సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై వినియోగదారులకు నమ్మకం కలిగించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. మే 4న ‘టీజీ ఆర్గానిక్స్’ పేరుతో ఈ యాప్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ యాప్పై శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్షించారు. రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారి ఉత్పత్తులకు మారెట్లో సరైన గుర్తింపు లేకపోవటం, ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మార్కెట్లో దళారులు సేంద్రియ ఉత్పత్తుల పేరుతో వినియోగదారులను మోసం చేయడం తదితరాలకు చెక్ పెట్టేలా ఈ యాప్ దోహదం చేస్తుందని చెప్పారు.