హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పాలనా కేంద్రమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ‘కాంగ్రెస్ పార్టీ’ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్లు, పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలో చర్చించినట్టు స్వయంగా మధుయాష్కీ గౌడ్ వర్గీయులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ నియోజకవర్గంలో గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నది. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ సమావేశంపై రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. మంత్రి తుమ్మల అధికారిక చాంబర్లో పార్టీ సమావేశాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ‘ప్రభుత్వ పాలనా భవనాన్ని.. పార్టీ కార్యాలయంగా మార్చేస్తారా?’ అని మండిపడుతున్నారు. ‘అది సచివాలయం అనుకుంటున్నారా?.. గాంధీ భవన్ అనుకుంటున్నారా?’ అని నిలదీస్తున్నారు. మంత్రి హోదాలో ఉండి పార్టీ కండువా వేసుకొని, పార్టీ సమావేశం నిర్వహిచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గం అయినంత మాత్రాన సచివాలయంలో సమావేశం నిర్వహిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయ సమావేశంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.