హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కలియుగ దైవం తిరుమల వేంకటేశుడు అత్యంత సంపన్నుడు. భక్తులు శ్రీవారికి సమర్పిస్తున్న కానుకలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 7,163 ఎకరాల విస్తీర్ణంలో 960 ఆస్తులున్నాయని, వాటి విలువ రూ.85,706 కోట్లని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆదివారం జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో రెండేండ్ల విరామం తర్వాత ఈ నెల 27 నుంచి జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల తదుపరి టైంస్లాట్ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని, ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తామని వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి పనులను వైవీ సుబ్బారెడ్డి వివరించారు.