హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshanam) ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మూడు రోజులకు సంబంధించిన ఆన్లైన్ ఈ-డిప్లో (E-Dip) ఎంపికైన భక్తుల వివరాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. గత నెల 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తుల వివరాలు సమర్పించారు.
ఈ-డిప్లో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ పంపనున్నారు. అందులోని లింక్ ఓపెన్ చేసుకుని ఉచిత టోకెన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30న 57వేలు, 31న 64వేలు, జనవరి 1న 55 వేల టోకెన్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తున్నది. మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులను నేరుగా అనుమతించనున్నారు. ఇక, రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్ల కోటా అమలు చేస్తారు. వీటికి సంబంధించిన టోకెన్లను టీటీడీ ఈనెల 5న ఆన్లైన్లో విడుదల చేయనుంది.