Tirumala | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): తిరుమలలో మంగళవారం నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభించిన ఉత్తర ద్వారాదర్శనం సోమవారంతో ముగియనున్నది. డిసెంబర్ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంకాగా నిత్యం 60 వేల నుంచి 80 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సర్వదర్శనాన్ని రద్దు చేసి, దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రత్యేక ఉచిత టోకెన్లు ఉచితంగా పంపిణీ చేసి ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది.
జనవరి 1న శ్రీవారి ఆలయంలో పెద్దశాత్తుమొర, వైకుంఠ ద్వారదర్శనం ముగింపు, 5న అధ్యయనోత్సవాలు ముగింపు, 6న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు కార్యక్రమాలు, 7న సర్వ ఏకాదశి, 9న తొండర డిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం ఉంటాయని అధికారులు తెలిపారు. 14న భోగిపండుగ, ధనుర్మాసం ముగింపు, 15న మకర సంక్రాంతి, సుప్రభాత సేవ పునఃప్రారంభం, 16న పార్వేట మండపానికి వేంచేపు, కనుమ పండుగను వైభవంగా జరుపనున్నట్టు పేర్కొన్నారు. జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 31న కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు.