హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేటలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్లో ఇటీవలే ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసినట్టు చెప్పారు.
సిద్దిపేటలో శ్రీవారి ఆలయం నిర్మించాలని, అందుకు ఆరు ఎకరాల స్థలం కేటాయిస్తామని ఏపీ సీఎం జగన్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల లేఖ రాశారని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు సిద్దిపేటలో ఆలయం నిర్మించాలని మండలి నిర్ణయించిందని సుబ్బారెడ్డి తెలిపారు.