కమాన్చౌరస్తా, మే 31 : కరీంనగర్ జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టే ఆలయ నిర్మాణ పనులకు బుధవారం ఆయనతోపాటు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు, టీటీడీ ఎల్ఏసీ సభ్యుడు భాస్కర్రావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మేయర్ వై సునీల్రావు శంకుస్థాపన చేశారు. ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభారాధన, విశేష హోమాలు జరిపారు.
ఫిలేష్టికలు, శంఖువుకు అభిషేకం చేసి అనంతరం వేదమంత్రాలతో పూజలు చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైవీ సబ్బారెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా ఆలయ నిర్మాణానికి పదెకరాలు కేటాయించి సహకారం అందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నిర్మించే ఆలయంలో తిరుమల తరహాలో సేవా కార్యక్రమాలు ఉంటాయని, అమ్మవార్ల ఆలయాలు, నాలుగు మాడవీధులు, అర్చకులు, ప్రసాద పోటుకు ప్రత్యేక గదుల, నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు. ఇందుకోసం ఏపీ సీఏం సహకారంతో రూ.20కోట్లు టీటీడీ పాలక మండలి మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. రెండేండ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, జిల్లా పరిషత్తు చైర్మన్ కనుమల్ల విజయ, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, సాయంత్రం శ్రీనివాస కల్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు.