హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జమ్ములోని మజీన్ గ్రామం లో నిర్మిస్తున్న వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని తెలిపారు. మజీన్లో జరుగుతున్న ఆలయ పనులను బుధవారం అధికారులతో కలిసి ఆయ న పరిశీలించారు.
62 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో నిర్మించిన ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8 వరకు విగ్రహ ప్రతిష్ఠాపన, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జమ్ము నుంచి శ్రీవైష్ణోదేవి ఆలయానికి వెళ్లే కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉన్నదని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రధాన నగరాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్ అమరావతి తదితర ప్రాంతాల్లో ఆలయాల ను నిర్మించామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అహ్మదాబాద్, రాయపూర్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు.