తిరుపతి : తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మే 31వ తేదీ భూమి పూజ జరుగనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం 6.50 నుంచి 7.20 గంటలకు మిథున లగ్నంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించనున్నారని తెలిపారు. తెలంగాణకు చెందిన మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
హర్యానాలో బ్రహ్మోత్సవాలు..
హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం మే 30న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగనుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహనసేవల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.