వరంగల్, మే 24: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అడిటోరియంలో దాస్యం రంగశీల ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన నిపుణ ‘కొలువు-గెలువు’ పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. సర్కారీ కొలువులు సాధించేందుకు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వందలాది మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా హజరైన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పత్రికగా ముందుండి నడిపించిన నమస్తే తెలంగాణ నేడు రాష్ట్రంలో కొలువుల జాతర నడుస్తున్న సమయంలో ఉద్యోగార్థుల పత్రికగా మారిందని కొనియాడారు. నమస్తే తెలంగాణ పత్రిక ఏర్పాటు చేస్తున్న సదస్సులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువతకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడంతో యువతలో ఉద్యోగాల జోష్ కనిపిస్తున్నదని పేర్కొన్నారు. వాళ్లను చూస్తూంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న కోరిక కలుగుతున్నదని చెప్పారు. యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి అధికారులుగా మారాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువత నెగెటివ్ అలోచనలు పక్కన పెట్టి పాజిటివ్ దృక్పథంతో ముందుకు అడుగువేయాలని సూచించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా పకడ్బందీగా నియామకాల ప్రక్రియకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా నమస్తే తెలంగాణ తన బాధ్యతగా భావించి బాసటగా నిలుస్తుండటం అభినందనీయమని చెప్పారు.
పోటీ పరీక్షల్లో ఏ విధంగా రాణించాలి, ఎలా సన్నద్ధం కావాలనే అంశాలపై సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప ఉద్యోగార్థులకు అవగాహన కల్పించారు. ఉద్యోగ సాధనలో విజయం సాధించేందుకు మెళకువలను చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు సదస్సులో విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. గంట పాటు నిపుణులు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో దాస్యం రంగశీల ఫౌండేషన్ కోఆర్డినేటర్ దాస్యం విజయభాస్కర్, బాధ్యుడు ప్రణయ్, నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ బ్రాంచి మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, సర్క్యులేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్రెడ్డి, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ అప్పని సూరి, డెస్క్ ఇన్చార్జి కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.