హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): జనవరి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్ సోమవారం సీతాలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సొసైటీ పరిధిలో దాదాపు 20వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉంటారని, 12వ తేదీ వచ్చినా ఇప్పటికీ జనవరి నెల వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల రిక్రూట్మెంట్ కంటే ముందే పదోన్నతులు, బదిలీలు పూర్తిచేయాలని సీతాలక్ష్మిని కోరారు. లేదంటే సీనియర్లకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.