ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్
మేడారం జాతర ఏర్పాట్ల పరిశీలన
ములుగు, ఫిబ్రవరి 3: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు మెచ్చేలా రవాణా సౌకర్యం కల్పిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. బస్ డే సందర్భంగా గురువారం ఆయన వరంగల్ నుంచి మేడారం వరకు బస్సులో వచ్చారు. గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు ఎత్తు బెల్లం సమర్పించారు. అనంతరం మేడారంలోని బేస్ క్యాంప్ వద్ద ప్రయాణికులు, సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు, బస్సులు నడిచే మార్గాలు, క్యూ లైన్లు, టెంట్ల ఏర్పాట్లను పరిశీలించారు. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యతోపాటు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రవాణా సదుపాయం కల్పించాలని, ఇందుకోసం పోలీస్, వైద్య, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులను అమ్మవారి గద్దెల సమీపం వరకు చేరవేయాలన్నారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు.