హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులను వారి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లనున్నాయి. మళ్లీ పరీక్ష ముగిసిన తర్వాత కూడా బస్సులో అందుబాటులో ఉండనున్నాయి. అయితే విద్యార్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది.
మొత్తం 5,09,275 మంది పదో తరగతి పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద చల్లని తాగునీరుతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కూడా అందుబాటులో ఉండనున్నారు.