హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమించుకునే అంశాన్ని పరిశీలించాలని సంస్థ ఎండీ సజ్జనార్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హైదరాబాద్లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్లో గురువారం గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్తోపాటు మేడారం జాతరలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులకు, దసరా లక్కీ డ్రా విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీలోని పెండింగ్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. మహాలక్ష్మి పథకం కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దీనికనుగుణంగా కొత్త బస్సు లు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. సంస్థ అభివృద్ధి కోసం సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని, వీరి కృషిని గుర్తించి అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. జాతీయస్థాయిలోనూ టీఎస్ఆర్టీసీకి అవార్డులు లభించాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్, సీవోవో డాక్టర్ రవీందర్, ఈడీ మునిశేఖర్, పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, పైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథరావు పాల్గొన్నారు.