హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్ హామీ ఇచ్చినట్టు టీఎస్ఆర్టీసీ టీఎంయూ ప్రధానకార్యదర్శి థామస్రెడ్డి తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలిచిన సందర్భంగా థామస్ రెడ్డి నేతృత్వంలోని పలువురు ఆర్టీసీ నేతలు సోమవారం మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికులకు రావాల్సిన పీఆర్సీ అతిత్వరలోనే అందేలా చర్యలు తీసుకొంటామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారని థామస్రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణకు మంత్రులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావుకు, పువ్వాడకు టీఎంయూ తరఫున థామస్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారిని శాలువాతో సత్కరించారు. మంత్రులను కలిసిన వారిలో టీఎంయూ అధ్యక్షుడు కమలాకర్గౌడ్, ముఖ్యసలహాదారు బీ యాదయ్య తదితరులు ఉన్నారు.