TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో డీఏను మంజూరు చేసింది. అక్టోబర్ వేతనంతో కలిసి డీఏ చెల్లించనున్నది. అలాగే, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న తొమ్మిది డీఏలను సైతం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి.. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం.. తాజాగా డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సిన ఉన్న 4.8 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారన్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని చెప్పారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలమని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారీగా ఇప్పటి వరకు 9 డీఏలను మంజూరు చేశామని, తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించిందని సజ్జనార్ వివరించారు.